Wednesday 25 November 2009

'మంచు'కొస్తున్న ముప్పు!

2035 నాటికల్లా హిమాలయాలు కనుమరుగు!?

హిమాలయ పర్వతాలు.. పేరు వింటే చాలు చల్లని గాలి తెమ్మర తాకినట్లు ఒళ్లు పులకరిస్తుంది. మన దేశానికి ఉత్తరాన శత్రు దుర్భేద్యంగానే కాదు, దేశంలో ప్రవహించే హిందూ, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులు జీవ నదులుగా ప్రసిద్ధికెక్కడానికి కూడా మంచు పర్వతాలే కారణం. అలాంటి మహోన్నతైన హిమాలయాలకు ముప్పు ముంచుకొచ్చింది. ఇప్పుడు కాదు.. చాలా ఏళ్లుగా.. భూతాపం కారణంగా హిమాలయాలపై ఉన్న మంచు పొరలు కరిగి నీరైపోతున్నాయి. కరగడంలో కూడా అలా ఇలా కాదు.. ప్రపంచంలో ప్రాంతంలోనూ మంచు కరగనంత వేగంగా మన హిమాలయాలు కరిగిపోతున్నాయట. ఇది ఇలాగే సాగితే, మరో పాతికేళ్ల తరువాత హిమాలయాలు అసలు కనిపించకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్లోబల్‌ వార్మింగ్‌ (భూతాపం) విపరీతంగా పెరిగిపోవడం వల్ల హిమాలయ శ్రేణుల్లోని మంచు త్వరితగతిన కరిగిపోతుండడంపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తుతుందని ఏళ ్లతరబడి పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక చర్చాపత్రం తీవ్ర వివాదాస్పదమైంది. అసలు భూతాపానికి, హిమాలయాలు కరగడానికి మధ్య సంబంధాన్ని ధ్రువీకరించే ఎలాంటి ఆధారమూ ఇంతవరకు లభించలేదని కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ ఆ పత్రంలో పేర్కొనడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి వాదనతో ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపిసిసి) తీవ్రంగా విభేదిస్తోంది. నోబెల్‌ బహుమతి పొందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో ఏర్పాటైన ఈ సంస్థ వాతావరణంలో కలుగుతున్న మార్పులపై అధ్యయనం జరిపి రెండేళ్ల క్రితమే తన నాలుగో సమగ్ర నివేదికను విడుదల చేసింది.
ఐపిసిసి నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ కరగనంత వేగంగా మన హిమాలయాలపై ఉన్న మంచు పొరలు కరిగిపోతున్నాయి. హిమాలయాలలో మంచు పొరలు కరిగి నీరైపోవడం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని, వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయనడానికి, భూతాపం రోజురోజుకి పెరుగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని ఐపిసిసి ప్రశ్నిస్తోంది. అంతేకాదు, ఈ భూతాపం, హిమాలయాలలో మంచు కరగటం ఇలాగే కొనసాగితే, 2035 నాటికి హిమాలయాలు పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమని కూడా ఈ సంస్థ హెచ్చరిస్తోంది.
భారీ ముప్పు..
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావం ఒక్క మనదేశంపైనే కాదు.. యావత్‌ ఆసియం ఖండంపై ప్రభావం చూపుతోంది. రానున్న రోజుల్లో వంద కోట్ల మందికిపైగా ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి బారిన పడనున్నట్లు కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన చర్చాపత్రాన్ని తయారు చేసింది ఎవరో ఆషామాషీ వ్యక్తి కాదు. జియొలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో డిప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ హోదాలో పని చేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి. ఆయన పేరు వి.కె.రైనా. " హిమాలయ పర్వతాలపై ఉన్న మంచు పొరలు కరగ డం అనేది చాలా దశాబ్దాల క్రితమే మొదలైంది. అయితే ఈ విషయాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు పంతొమ్మిదో శతాబ్దం మధ్య భాగంలోనే గుర్తించగలిగారు. కానీ గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న అధ్యయనంలో హిమాలయ పర్వత సానువులకంటే కూడా అలస్కా, గ్రీన్‌లాండ్‌ ప్రాంతాలలో మంచు పొరలు శరవేగంగా కరిగిపోతున్నట్లు తెలుస్తోంది..'' అని రైనా ఆ చర్చాపత్రంలో పేర్కొన్నారు. అంతేకాదు, "మంచు పొరలు కిందికి జారటం, ఆ సమయంలో వచ్చే ఒకరకమైన శబ్దం.. వీటిని బట్టి మంచు పొరలు కరిగిపోతున్నాయని, ఇందుకు కారణం భూతాపమేనని శాస్త్రీయంగా చెప్పలేం. ఎందుకంటే ఈ మంచు పొరలు జారటం అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుగుతోంది.
అంతెందుకు.. గంగోత్రి పర్వత సానువులనే తీసుకుంటే .. అక్కడ గత రెండు సంవత్సరాలుగా మంచు కరిగిన దాఖలాలు లేవు..'' అని వి.కె.రైనా పేర్కొనడం తీవ్ర దుమారం రేపింది.
నిపుణులు ఏమంటున్నారు?
వి.కె.రైనా వాదనను, ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన చర్చాపత్రంలో పేర్కొన్న విషయాలలో కొన్నింటిని ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ చైర్మన్‌ రాజేంద్ర పచౌరి మాత్రం కొట్టిపారేశారు. " బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి నివేదికలు ఎలా తయారు చేస్తారో నాకు అర్థం కావ డం లేదు..'' అని ఆయన 'ది గార్డియన్‌' దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేకాదు " అసలు ఆ చర్చాపత్రం అశాస్త్రీయమైనది, ఏకపక్షంగా రూపుదిద్దుకున్నది..'' అంటూ ఢిల్లీలోని ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌(టిఇఆర్‌ఐ)కు చెందిన లీడింగ్‌ గ్లేసియాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ సయ్యద్‌ ఇక్బాల్‌ హస్నయిన్‌ అభిప్రాయపడుతున్నారు. వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల శాతం పెరుగుతోందని 1980 తరువాత ప్రచురితమైన పలు శాస్త్రీయ కథనాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం ఈ చర్చా పత్రాన్ని రూపొందించిందని, హిమాలయ పర్వతసానువుల్లో మంచు పొరలు కరగటానికి ప్రధాన కారణం భూతాపమేనని ఈ శాస్త్రీయ కథనాలలో తగిన ఆధారాలు కూడా ఉన్నాయని హస్నయిన్‌ తన ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. నిజానికి పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ 'హిమాలయాలు-కరుగుతున్న మంచు' అనే అంశంపై తాను రూపొందించిన చర్చాపత్రాన్ని విడుదలకు నెలరోజుల ముందే సమీక్ష కోసం
గ్లేసియాలజిస్ట్‌ సయ్యద్‌ ఇక్బాల్‌ హస్నయిన్‌ వద్దకు పంపించింది. దానిని ఆమూలాగ్రం చదివిన ఆయన తన కామెంట్స్‌ను, వాటికి సంబంధించిన ఆధారాలను సైతం ఆ శాఖకు అందజేశారు. అయినప్పటికీ వాటిని ఆ మంత్రిత్వ శాఖ విస్మరించడమే కాకుండా ఎలాంటి మార్పులు చేయకుండానే చర్చాపత్రాన్ని విడుదల చేసింది.
మంచు నీటి మళ్లింపు..
నిజానికి హిమాలయాలలో మంచు పొరలు కరగడానికి వాతావరణంలోకి విడుదల అవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులలోని ఒక్క కార్బన్‌డయాక్సైడ్‌ మాత్రమే కారణం కాదని, బ్లాక్‌ కార్బన్‌, మీథేన్‌లతోపాటు వాతావరణంలోని ఓజోన్‌ కూడా ఇందుకు కారణమవుతున్నాయనే ది ప్రముఖ గ్లేసియాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ ఇక్బాల్‌ హస్నయిన్‌ అభిప్రాయం. ఒక్క హస్నయిన్‌ మాత్రమే కాదు, హిమాలయ పర్వత సానువులలో తూర్పు దిక్కున మంచు పొరలు కరిగి, ఆ నీరంతా పారుతూ వచ్చి నేపాల్‌, సిక్కిం, భూటాన్‌ సరిహద్దుల్లో పెద్ద పెద్ద సరస్సులుగా మారుతోందని టిఇఆర్‌ఐకే చెందిన మరో గ్లేసియాలజిస్ట్‌ శ్రేష్ఠ్‌ తయాల్‌ కూడా అభిప్రాయపడుతున్నారు. వీరి అభిప్రాయాలు నిజమనడానికి ప్రతిష్ఠాత్మక సైన్స్‌ పత్రిక 'నేచర్‌' ఇటీవల ప్రచురించిన కథనాలే తాజా ఉదాహరణ. నేచర్‌ కథనాల ప్రకారం.. హిమాలయాలలోని మంచు నిరంతరం కరుగుతూ, ఆ నీరంతా తమ దేశంవైపు ప్రవహిస్తుండడంతో, తమ దేశంలో వరదలు సంభవించకుండా ఆ నీటిని దారి మళ్లిస్తూ భూటాన్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు - 2001లో ఉత్తరాఖండ్‌లోని హెచ్‌ఎన్‌బి ఘర్‌వాల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది జియాలజిస్ట్‌లు రూపొందించిన ఓ శాస్త్రీయ పత్రాన్ని 'కరెంట్‌ సైన్స్‌' పత్రిక ప్రచురించింది. ఈ పత్రిక కథనం ప్రకారం.. గత రెండు వందల సంవత్సరాలలో హిమాలయాలలోని గంగోత్రి పర్వత శిఖరం ఎత్తు రెండు కిలోమీటర్ల మేర తగ్గింది. ఇందులో నలభై శాతం తరుగుదల కేవలం గత 25 సంవత్సరాలలోనే సంభవించింది. అంటే.. గత రెండు వందల సంవత్సరాల కంటే ఇటీవలి పాతిక సంవత్సరాలలోనే ఈ శిఖరం ఎక్కువగా కరిగిపోయిందన్నమాట. ఇందుకు కారణం.. ఇంకేముంటుంది 'భూతాపం' తప్ప.
అసలు నిజం.. ఉపగ్రహానికెరుక!
ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఛీనాబ్‌, పార్వతి, బసవ బేసిన్స్‌లో ఉన్న 466 మంచు కొండలను అధ్యయనం చేసి ఆసక్తి కరమైన విషయాలను కనుగొంది. 1962 నాటితో పోల్చి చూసుకుంటే ప్రస్తుతం ఈ మంచు కొండలన్నీ 21 శాతం తరిగిపోయాయని ఈ బృందం తేల్చింది. ఇదే విషయాన్ని 2007లో తయారు చేసిన ఓ పత్రంలో కూడా అనిల్‌ కులకర్ణి తదితర శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు, ఇటీవల స్పేస్‌ ఏజెన్సీకి చెందిన శాస్త్రావేత్తల బృందం హిమాలయాలలో కరుగుతున్న మంచు కారణంగా ఎంత నీరు సట్లెజ్‌ నదిలో చేరుతుందనే విషయంపై కూడా అధ్యయనం జరిపింది. 2040 నాటికి హిమాలయాలలో ఉష్ణోగ్రత ఇప్పుడున్నదానికంటే మరొక్క డిగ్రీ సెల్సియస్‌ పెరుగుతుందని, దాని వల్ల సట్లెజ్‌ నదిలో చేరే నీరు ఇప్పుడున్నదానికంటే 8 నుంచి 28 శాతం అధికంగా ఉండొచ్చనేది శాస్త్రవేత్తల అంచనా!





Wednesday 18 November 2009

అంతరిక్షంలోకి.. అనుకోని అతిథులు!

తేదీ : 16 నవంబరు 2009
సమయం : మధ్యాహ్నం 2:28 గంటలు
ప్రదేశం : ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌, లాంచ్‌ప్యాడ్‌ 39-ఎ.
విషయం : ఆరుగురు వ్యోమగాములు, అంతరిక్ష కేంద్రానికి చేరవేయాల్సిన వివిధ పరికరాలతో వ్యోమనౌక అట్లాంటిస్‌ సిద్ధంగా ఉంది. అఖరుసారి అన్ని తనిఖీలు విజయవంతంగా నిర్వహించిన తరువాత గ్రౌండ్‌ కంట్రోల్‌ నుంచి మిషన్‌ కౌంట్‌ డౌన్‌ మొదలైంది.
5... 4... 3... 2... 1... 0... బ్లాస్ట్‌!
నిప్పులు చిమ్ముకుంటూ అట్లాంటిస్‌ నింగికి ఎగసింది.

'ఏంటీ.. ఇదంతా ప్రతిసారీ జరిగేదే కదా..' అనుకుంటున్నారు కదూ! ఆగండి.. తొందరపడకండి. ఈ అట్లాంటిస్‌ వ్యోమనౌకలో వ్యోమ గాములతో పాటు వానపాము జాతికి చెందిన కొన్ని వేల లార్వాలను కూడా అంతరిక్షంలోకి పంపించారు. ఇదీ అసలు విశేషం!
ఏం చేస్తారు...?
అంతరిక్షంలోకి వెళ్లి రావడం మనం అనుకునేంత సులువేం కాదు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా ఎంతో కఠోర శిక్షణ పొందినా.. వెళ్లేటప్పుడున్నంత ఉత్సాహం తిరిగి వచ్చేటప్పుడు వ్యోమగాముల్లో కనిపించదు. కారణం.. అంతరిక్షంలో గడిపేది కొద్దిరోజులే అయినా.. అప్పటికే వారి కండరాలు బాగా క్షీణిస్తాయి. అందువల్లే అంతరిక్ష కేంద్రంలో కొన్ని రోజులపాటు విధులు నిర్వర్తించిన వ్యోమగాములను భూమిమీదికి చేర్చడం.. వారి స్థానంలో ఇతర వ్యోమగాములను పంపించడం. అయితే రోదసిలో మానవ కండరాల క్షీణత ఎలా జరుగుతుందనేది నేటికీ అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు పూనుకున్నారు. సోమవారం అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన వ్యోమనౌక అట్లాంటిస్‌లో వ్యోమగాములతోపాటు కొన్ని వేల వానపాము లార్వాలను కూడా పంపించారు. ఇవి ఎంత చిన్నవి అంటే.. మైక్రోస్కోప్‌ కింద చూస్తే తప్ప కనిపించని పరిమాణంలో ఉంటాయి. అసలు అంతరిక్షంలో ఏం జరుగుతుంది? ఈ కండరాల క్షీణత కేవలం మానవుల్లోనేనా? లేక ప్రాణమున్న ప్రతి జీవిలోనూ జరుగుతుందా? దేని ప్రభావం వల్ల ఇలా జరుగుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ వానపాము లార్వాలే జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి భూమ్మీదికి తిరిగొచ్చాక వీటి శరీరంలో వచ్చిన మార్పులపై నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు అవసరమైన పరిశోధనలు నిర్వహిస్తారు. దీంతో అసలు జీవుల్లో కండరాలు నిర్మింపబడడానికి, క్షీణించడానికి కారణాలేమిటో తెలిసిపోతాయన్నది జీవ శాస్త్రవేత్తల అంచనా.
రోదసిలో ఎక్కడ...?
వ్యోమనౌక అట్లాంటిస్‌ బుధవారం నాటికి అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది. ఆ తరువాత ప్రత్యేకమైన సెల్‌ కల్చర్‌ బ్యాగ్స్‌లో.. సుషుప్తావస్థలో.. ఉన్న ఈ వానపాము లార్వాలను అంతరిక్ష కేంద్రంలోని జపాన్‌కు చెందిన జీవ ప్రయోగశాల 'కిబో'కు చేరుస్తారు. అక్కడ వీటిని మళ్లీ జాగృతావస్థలోకి తీసుకొచ్చి.. వ్యోమగాముల మాదిరిగానే వీటిని కూడా భార రహిత స్థితికి గురిచేస్తారు. నాలుగు రోజులపాటు వీటిని అంతరిక్ష వాతావరణంలో ఉంచి తిరిగి సుషుప్తావస్థకు చేరుస్తారు. తిరిగి భూమ్మీదికి తీసుకొచ్చాక నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయంలోని ప్రయోగశాలకు చేర్చి, అంతరిక్షంలో గడిపిన సమయంలో వాటి శరీరాలలో వచ్చిన మార్పులపై అధ్యయనం చేస్తారు.
ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో ఉన్న కిబో ప్రయోగశాలలో బయోమెడిసిన్‌, మెటీరియల్‌ సైన్స్‌ తదితర విషయాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఇక్కడికి చేరే వానపాము లార్వాలపై నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్లినికల్‌ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్‌ నాథానియేల్‌ పరిశోధనలు జరుపుతారు. ముఖ్యంగా వానపాము లార్వాల శరీరాలలోని కండరాలలో ప్రొటీన్‌ విచ్ఛిన్నానికి కారణమయ్యే సంకేతాలేమిటో ఈయన అధ్యయనం చేస్తారు. ఈ పరిశోధనలు గనుక ఫలిస్తే.. కండరాల క్షీణతకు గురయ్యే రోగుల శరీరాలలో దీర్ఘకాలం ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయంపై శాస్త్రవేత్తలకు మరింత అవగాహన కలుగుతుంది. అలాగే వృద్ధాప్యం మీద పడి కదలలేని స్థితిలో మంచంపైనే ఉండేవారు, మధుమేహ రోగగ్రస్థుల శరీరాలలో కండరాలు క్షీణించడానికి కారణాలేమిటో కూడా తెలుస్తుంది.
అవే ఎందుకని...?
అంతరిక్షంలో మానవ కండరాల క్షీణతపై జరిపే పరిశోధనలలో వానపాము లార్వాలనే ఎంచుకోవడానికి ఒక కారణముంది. ఈ వానపాము లార్వాలు సి-ఎలిగాన్స్‌ అనే రకానికి చెందినవి. ఇవి ఈ భూమిపై ఆవిర్భవించిన మొట్టమొదటి బహుకణ జీవులు. వీటి శరీరంలో ఉండే కండరాలు అచ్చు మానవ శరీరంలో ఉండే కండరాల మాదిరిగానే ఉంటాయి. వీటి జన్యువులలో అధికభాగం మానవ డిఎన్‌ఎలోని జన్యువులు నిర్వర్తించే విధులనే నిర్వర్తిస్తుంటాయి. మానవ శరీర నిర్మాణానికి వీటి శరీర నిర్మాణానికి చాలా దగ్గరి పోలికలు ఉండడంతో జీవ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు వీటినే ఎంచుకున్నారు. ఈ వానపాము లార్వాలను బ్రిస్టల్‌లోని ఓ చెత్త కుప్ప నుంచి సేకరించారు. సి-ఎలిగాన్స్‌ ఆర్‌ఎన్‌ఎఐ ఇన్‌ స్పేస్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (సిఇఆర్‌ఐఎస్‌ఇ) గా పిలుస్తున్న ఈ పరిశోధనలన్నీ జపాన్‌లోని సెండాయ్‌లో ఉన్న టొహొకు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ అత్సుషి హిగాషితాని ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఈయనే ఈ ప్రాజెక్టుకు ముఖ్య పరిశోధకుడు. " ఈ భూమ్మీద మనకు తెలియని కొన్ని విషయాలు అంతరిక్షంలో తెలుస్తాయి. అంతరిక్షంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా మన శరీరం ఎలాంటి మార్పులకు గురవుతుందో వానపాము లార్వాలపై జరిపే ఈ పరిశోధనల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం..'' అని ప్రొఫెసర్‌ అత్సుషి హిగాషితాని వ్యాఖ్యానిస్తున్నారు.


Saturday 14 November 2009

రాక్షసి బల్లుల కనుమరుగుకు కారణమిదేనా?

హిందూ మహాసముద్ర జలాల్లో భూమిని ఢీకొట్టిన భారీ గ్ర హ శకలం
500 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ గొయ్యి
శివ క్రే టర్‌పై శాసవేత్తల దృష్టి

ఓ భారీ గ్రహశకలం గతితప్పి భూమికేసి దూసుకొచ్చింది. సుమారు 40 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఆ గ్రహ శకలం ముంబైకి సమీపంలో హిందూ మహా సముద్ర జలాల్లో భూ ఉపరితలాన్ని ఢీకొట్టింది. భారీ పేలుడు సంభవించింది. క్షణాల్లో పరిసరప్రాంతాల్లో ఉష్ణోగ్రత కొన్ని వేల డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అణుబాంబులన్నీ ఒక్క సారిగా పేలిపోతే ఎంత శక్తి విడుదలవుతుందో.. పేలుడు సందర్భంగా అంత శక్తి విడుదలైంది. గ్రహశకలం భూమిని గుద్దుకోవడం కారణంగా దాదాపు 500 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో భారీ గొయ్యి(క్రేటర్‌) ఏర్పడింది. ఈ సంఘటన వల్ల అప్పటికి భూమిపై నివసిస్తున్న సమస్త జీవరాశులు తుడిచిపెట్టుకు పోయాయి. ఇదేం సైన్స్‌ఫిక్షన్‌ సినిమా కాదు.. 6.5 కోట్ల సంవత్సరాల కిత్రం వరకు ఈ భూమిపై తిరుగాడిన రాక్షసబల్లులు ఎలా అంతరించిపోయాయన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానమిది.

మానవులకు పూర్వం.. 14 కోట్ల సంవత్సరాలపాటు ఈ భూమిపై ఏకచ్ఛత్రాధిపత్యంగా జీవనం సాగించిన డైనోసార్లు ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం ఒక్కసారిగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇందుకు కారణం భారీ గ్రహశకలం ఢీకొట్టడమేనని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీకి చెందిన శంకర్‌ ఛటర్జీ అనే ప్రొఫెసర్‌ ఈ కొత్తవాదనను తెరపైకి తెచ్చారు. ఈయన ముంబైకి పశ్చిమ తీర ప్రాంతంలో ఆనాడు గ్రహశకలం ఢీకొనడం వల్ల ఏర్పడిన భారీ గొయ్యిని కూడా గుర్తించారు. దానికి శివ క్రేటర్‌ అని పేరు పెట్టారు. అయితే.. ఛటర్జీ ప్రతిపాదనలు డైనోసార్ల విలుప్తంపై వెల్లువెత్తిన అన్ని ప్రశ్నలకు పూర్తిస్థాయిలో సమాధానాలు ఇవ్వడం లేదు. ఉదాహరణకు.. ప్రపంచ వ్యాప్తంగా భూమి మీద తిరుగాడే అన్ని డైనోసార్లు ఏకకాలంలో చనిపోయాయి. అదే సమయంలో.. మిగతా చిన్న జీవులు, ఎగిరే రాక్షస బల్లులు మాత్రం ఈ ఉత్పాతం నుంచి ప్రాణాలతో బయటపడగలిగాయి. ఇదెలా సాధ్యమైందన్న ప్రశ్నకు ఇంత వరకు సరైన సమాధానం దొరకలేదని అమెరికా పేలియోనాలజిస్ట్‌ గ్రెగరీ పాల్‌ వ్యాఖ్యానించారు.
ఎలా అంతరించిపోయాయి?
రాక్షసబల్లులు ఎలా అంతరించిపోయాయనే విషయమై ప్రస్తుతం రెండు సిద్ధాంతాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం, మరొకటి.. అగ్నిపర్వతాల పేలుడు. భారీ గ్రహశకలం లేదా తోకచుక్క భూమిని బలంగా ఢీకొట్టడం వల్ల రాక్షసబల్లులన్నీ అంతరించి పోయాయని విశ్వసించే శాస్త్రవేత్తలు చాలా మందే ఉన్నారు. శంకర్‌ ఛటర్జీ కంటే ముందు కొందరు శాస్త్రవేత్తలు చిక్సులుబ్‌ క్రేటర్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈ భారీ గొయ్యి మెక్సికోలోని యుకాటన్‌ ద్వీపకల్పంలో ఉంది. చిక్సులుబ్‌ విస్తీర్ణాన్ని పరిశీలిస్తే.. ఆ గ్రహశకలానికి భూమి మీదున్న జీవులన్నింటినీ తుడిచిపెట్టేయగలిగిన శక్తి లేదని శాస్త్రవేత్తలు తేల్చిపారేశారు. దీంతో అగ్ని పర్వతాల పేలుళ్లే డైనోసార్ల విలుప్తానికి కారణమన్న వాదనకు ఊతం లభించింది. అయితే.. శంకర్‌ ఛటర్జీ శివ క్రేటర్‌ను గుర్తించడంతో.. మళ్లీ గ్రహశకల సిద్ధాంతానికి ప్రాచుర్యం లభించింది. దాదాపు 500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న శివ క్రేటర్‌ ఇప్పటి వరకు భూమిని గ్రహశకలాలు ఢీకొనడం వల్ల ఏర్పడిన క్రేటర్‌లలో కెల్లా అతి పెద్దది. రాక్షసబల్లుల విలుప్తానికి, శివ క్రేటర్‌కు సంబంధం ఉందని ఛటర్జీ వాదిస్తున్నారు.
భారత్‌
తో దగ్గర సంబంధం?
రాక్షసబల్లుల విలుప్తానికి, భారత్‌కు దగ్గర సంబంధం ఉందని ప్రస్తుతం శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు. మధ్య భారత దేశంలోని దక్కన్‌ పీఠభూమి ప్రాంతంలో భారీ అగ్నిపర్వత పేలుళ్ల వల్ల రాక్షసబల్లులు అంతరించాయనేది వారి వాదన. ఇందుకు జబల్‌పూర్‌ ప్రాంతంలో లభించిన భారీ టైటానోసారిడ్‌ డైనోసార్‌ శిలాజాలను సాక్ష్యంగా చూపిస్తున్నారు.జబల్‌పూర్‌ సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో జరిపిన తవ్వకాల్లో లావా ప్రవాహం మధ్యలో చిక్కుబడిపోయిన టైటానోసారిడ్‌కు చెందిన ఓ తుంటి భాగం శిలాజాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సాక్ష్యాల ఆధారంగా గ్రహశకలం ఢీకొట్టడంతోపాటు, అగ్నిపర్వతాల పేలుళ్లు కూడా రాక్షసబల్లుల విలుప్తానికి కారణమేనని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వాదనలు ఎలా ఉన్నా.. ఇప్పటికీ కొన్ని మౌలిక ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకలేదు. రాక్షసబల్లులు శారీరకంగా చాలా అభివృద్ధి చెందినవి. ఇవి ఉష్ణరక్త జీవులు. వాటితో పోల్చితే.. డైనోసార్లతో సహజీవనం చేసిన ఉభయచరాలు, కొన్ని రకాల పక్షి జాతులు చాలా అల్పమైనవి. గ్రహ శకలం ఢీకొన్నా.. లేదా అగ్నిపర్వతాలు బద్దలైనా వాతావరణంలో తక్షణమే చాలా తీవ్రమైన మార్పులొస్తాయి. విషరసాయనాలు పెద్ద మొత్తంలో వాతావరణంలోకి విడుదలవుతాయి. ఈ మార్పులకు కేవలం రాక్షసబల్లులు మాత్రమే బలైపోయి, ఉభయచరాలు, పక్షులు మాత్రం ఎలా బయటపడ గలిగాయనే ప్రశ్నకు మాత్రం ఇంతవరకు కచ్చితమైన సమాధానం దొరకలేదు.

Friday 13 November 2009

ఇంటెక్స్‌ డ్యూయల్‌ సిమ్‌ మొబైల్స్‌


భారతీయ వినియోగదారుల కోసం ఇంటెక్స్‌ కంపెనీ కొత్తగా నాలుగు డ్యూయల్‌ సిమ్‌ మొబైల్‌ ఫోన్లను విడుదల చేసింది. వీటి పేర్లు IN4495,
IN4410, ఐూ80, ఐూ20. వీటిలో IN4495, IN4410 మొబైల్‌ఫోన్లలో రెండు జిఎస్‌ఎం సిమ్‌ కార్డులను ఉపయోగించవచ్చు. IN80, IN20 ఫోన్లలో ఒక జిఎస్‌ఎం సిమ్‌ కార్డు, మరో సిడిఎంఎ సిమ్‌ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్లలో ఇంకా ఏమేం విశేషాలు ఉన్నాయో చూద్దామా..

IN4495 మోడల్‌ మొబైల్‌ఫోన్‌లో 6.1 సెం.మీ. QVCA టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేతోపాటు కెమెరా, ఎఫ్‌ఎం రేడియో, ఆడియో అండ్‌ వీడియో ప్లేయర్‌, బ్లూటూత్‌, యుఎస్‌బి పిసి కనెక్టివిటీ, ఆటో వాయిస్‌ రిప్లై, మోషన్‌ సెన్సర్‌ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఇంకా దీని ఎక్స్‌టర్నల్‌ మెమరీని 8 జిబి వరకు పెంచుకోవచ్చు. ఇందులో ఉన్న మరో వినూత్న అంశం ఏమిటంటే.. ఈ ఫోన్‌లో ఉన్న 'పీర్‌ కంట్రోల్‌' అనే ఫీచర్‌ ద్వారా మీరు బయట ఎక్కడైనా ఉన్నా (ఫోన్‌కు దూరంగా ఉన్నప్పుడు) ఓ సింపుల్‌ కోడ్‌ సాయంతో ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేయగలరు. అంతేకాదు ఈ సదుపాయంతో ఇంకా మీరు మీ ఫోన్‌కు సంబంధించి అనేక పనులు చేసుకోగలరు. రెండు రంగుల్లో లభ్యమయ్యే ఈ IN4495 మోడల్‌ మొబైల్‌ ఫోన్‌ ధర రూ.4,200.
ఇక ఇంటెక్స్‌
IN4410 మోడల్‌ డ్యూయల్‌ సిమ్‌ మొబైల్‌ ఫోన్‌ విషయానికొస్తే.. ఇందులో రెండు అంగుళాల వెడల్పైన టిఎఫ్‌టి డిస్‌ప్లేతోపాటు విజిఎ కెమెరా, వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం రేడియో (ఎక్స్‌టర్నల్‌ యాంటెన్నా లేకుండా), ఆడియో అండ్‌ వీడియో ప్లేయర్‌ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఇందులో 63 ఎంబి వరకు ఇన్‌బిల్ట్‌ మెమరీ ఉంది. ఈ ఫోన్‌ ధర రూ.3,400.
ఇక ఒక జిఎస్‌ఎం, మరో సిడిఎంఎ సిమ్‌ కార్డులను ఉపయోగించగలిగే.. ఇంటెక్స్‌
IN80 మొబైల్‌ ఫోన్‌లో 6.1 సెం.మీ. ఖగఎఅ రిజల్యూషన్‌ కలిగిన పెద్ద సైజు స్క్రీన్‌, 2 జిబి ఎక్స్‌పాండబుల్‌ మెమరీ, 153.6 ఓఞఛట వేగంతో డేటా డౌన్‌లోడ్‌ చేసుకోగల సౌకర్యంతోపాటు ఎఫ్‌ఎం రేడియో, కెమెరా, యుఎస్‌బి పిసి కనెక్టివిటీ, మోషన్‌ సెన్సర్‌, బ్లూటూత్‌, ఆడియో అండ్‌ వీడియో ప్లేయర్‌ విత్‌ 3.8 ఎంఎం స్టీరియోజాక్‌ తదితర సదుపాయాలు ఉన్నాయి. 7 గంటల వరకు టాక్‌టైమ్‌, 260 గంటలపాటు స్టాండ్‌బై టైమ్‌ కలిగిన ఈ ఫోన్‌ ధర రూ.5,000.
ఇక ఇంటెక్స్‌
IN20 మోడల్‌ ఫోన్‌ విషయానికొస్తే.. ఇదొక మ్యూజికల్‌ ఎడిషన్‌. ఎఫ్‌ఎం రేడియో, ఒన్‌ వే కాల్‌ రికార్డ్‌, మొబైల్‌ ట్రాకర్‌, సౌండ్‌ రికార్డింగ్‌ తదితర సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 1.5 అంగుళాల CSTN డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ 3 గంటల టాక్‌టైమ్‌, 150 గంటల స్టాండ్‌బై టైమ్‌ ఇవ్వగలదు. దీని ధర రూ.1,600.


'విండోస్‌7'కు పైరసీ దెబ్బ!


పైరసీ.. దెబ్బకు ఒక్క సినిమా రంగమే కాదు.. సాఫ్ట్‌వేర్‌ రంగం కూడా తలవంచక తప్పడం లేదు. సాఫ్ట్‌వేర్‌ పైరసీ అనేది చాలాకాలంగా చాపకింద నీరులా సాగిపోతోంది. ఇప్పటి వరకు ఎన్నో సాఫ్ట్‌వేర్‌లు పైరసీ బారిన పడినా.. తాజా ఉదాహరణ మాత్రం సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇన్‌కార్పొరేషనే. ఏళ్ల తరబడి ఊరించి.. ఊరించి, ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన తన కొత్త ఆపరేటింగ్‌ సిస్టం 'విండోస్‌7' కూడా పైరసీ బారిన పడడాన్ని మైక్రోసాఫ్ట్‌ జీర్ణించుకోలేకపోతోంది.



'విండోస్‌7'కు ఆసియా దేశాలలో పైరసీ దెబ్బ తగలడంతో దానిసృష్టికర్త, సాఫ్ట్వేర్దిగ్గజం.. మైక్రోసాఫ్ట్ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో సాఫ్ట్వేర్ను ఇదివరకేవిడుదల చేసిన మైక్రోసాఫ్ట్కొన్ని దేశాలలో మాత్రం విడుదలనుకొద్దిగా వాయిదా వేసుకుంది. అలాంటి దేశాలలో మన దేశంకూడా ఒకటి. సరిగ్గా అంశమే.. సాఫ్ట్వేర్పైరసీదారుల పాలిటవరంగా మారింది. సాఫ్ట్వేర్విడుదల కానీ దేశాల్లో సైతం పైరసీసాఫ్ట్వేర్డివిడిలు కుప్పలు తెప్పలుగా పుట్టుకురావడం, రూ.50కే 'విండోస్‌7' పైరసీ డివిడి లభించడం గమనించినమైక్రోసాఫ్ట్మిగిలిన దేశాలలో కూడా హడావిడిగా సాఫ్ట్వేర్నువిడుదల చేసింది. ఫలితంగా భారత దేశంలో గత గురువారమేవిండోస్‌7' విడుదలైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం చాలావరకు జరిగిపోయింది. మన దేశంలో ఇప్పటికే చాలా రోజులుగా సాఫ్ట్వేర్పైరసీ డివిడిలు చాటుమాటుగాలభిస్తున్నాయి.
సాప్ట్వేర్పైరసీ అనేది ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా సాగిపోతున్నప్పటికీ.. ఎన్నో ఏళ్లు శ్రమించి, విడుదల చేసినతన సాఫ్ట్వేర్‌.. అధికారికంగా విడుదల కాని దేశాల మార్కెట్లలో సైతం కనిపిస్తుండడం, మరీ రెండు డాలర్లకంటే తక్కువధరకు లభిస్తుండడంతో మైక్రోసాఫ్ట్దిగ్భాంతికి గురవుతోంది. పైరసీ బాధను తట్టుకోలేకే గతంలో తన 'ఆఫీస్‌' సాఫ్ట్వేర్ను చైనాలో రూ.1.360కే విక్రయించేందుకు కూడా సిద్ధమైంది. తాజాగా 'విండోస్‌7' కూడా పైరసీ బారిన పడడంతోచైనాలో దీని ధర మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు.

మొత్తానికి తన తాజా ఆపరేటింగ్సిస్టంకు ప్రపంచ వ్యాప్తంగా లభించిన స్పందనను బేరీజు వేసుకున్న మైక్రోసాఫ్ట్భారతదేశంలో సాఫ్ట్వేర్ను 40 శాతం తగ్గింపు ధరకే విక్రయించేందుకు సిద్ధమైంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగారూ.10,271 ఉన్న 'విండోస్‌7 - హోమ్ప్రీమియం సాఫ్ట్వేర్‌' ధరను మన దేశంలో మాత్రం 40 శాతం తగ్గించిరూ.6,799గా కంపెనీ నిర్ణయించింది. అలాగే హోమ్బేసిక్వెర్షన్రూ.5899, ప్రొఫెషనల్వెర్షన్రూ.11,199, ప్రొఫెషనల్ప్రీమియం(అల్టిమేట్‌) వెర్షన్రూ.11,799కి లభించనున్నాయి.

నిజానికి విండోస్‌ 7 ఆపరేటింగ్సిస్టం విడుదలను మన దేశంలో మైక్రోసాఫ్ట్వాయిదా వేయడానికి బలమైన కారణమేఉంది. మన దేశంలో ఏప్రిల్‌ 1 నుంచి కొత్త బడ్జెట్అమలులోకి వస్తుండడం, బడ్జెట్లో సాఫ్ట్వేర్లపై విధించే పన్నులోమార్పులు జరిగే అవకాశం ఉండడంతో దీనిని దృష్టిలో ఉంచుకుని మన దేశంలో సాఫ్ట్వేర్ను కాస్త ఆలస్యంగా విడుదలచేయాలని మైక్రోసాఫ్ట్భావించింది. అయితే పైరసీ బెడద కారణంగా తన వ్యూహం మార్చుకుని వెంటనే విడుల చేసింది. అంతేకాదు.. కొన్ని దేశాలలో విండోస్‌7 లైసెన్స్డ్సాఫ్ట్వేర్డివిడి కొన్న వినియోగదారులకు రూ.2600 విలువ కలిగినరిబాక్షూ'ను ఉచితంగా అందజేస్తామంటూ మైక్రోసాఫ్ట్భాగస్వామ్య సంస్థలు ఆఫర్ప్రకటించాయి. అయితే ఆన్లైన్లోకంపెనీని సంప్రదించిన వారం రోజుల్లోగా సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిన వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది.

మరోవైపు తక్కువ ధరకే లభిస్తోంది కదాని 'విండోస్‌7' పైరసీ డివిడి కొన్న వినియోగదారులకు సాఫ్ట్వేర్ఆప్డేషన్సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని మైక్రోసాఫ్ట్భావిస్తుండగా, పైరసీదారులు మాత్రం ఇబ్బందినీ అధిగమించేందుకు అనువైన అవకాశాల గురించి అన్వేషించడంలో తలమునకలవుతుండడం విశేషం.
‌‌‌ ‌ ‌ ‌ ‌‌ ' ‌ ‌ ‌‌ ‌‌ ‌ ‌‌ ‌ ‌ ‌‌‌ ‌‌ ‌‌ '‌‌ ‌‌‌‌‌

Thursday 5 November 2009

'నెట్‌' విరిగి భాషలో పడ్డాక..


'రొట్టె విరిగి నేతిలో పడ్డాక..' అనే సినిమా పాట ఆ రోజుల్లో ఎందరి నోళ్లలో నానిందో తెలియదుగానీ, ఇప్పుడు మాత్రం 'నెట్‌ విరిగి భాషలో పడ్డాక..' అనే పాట ఆన్‌లైన్‌ వీధుల్లో మోగిపోతోంది. దీనికి కారణం.. వెబ్‌సైట్‌ డొమైన్‌ పేర్లను ఇకమీదట ఎవరి భాషల్లో వారు పెట్టుకోవచ్చంటూ ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌(ఐకాన్‌) ఇటీవల సియోల్‌లో కీలక నిర్ణయం తీసుకోవడమే. ఐకాన్‌ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని.. ఇంటర్నెట్‌ పుట్టి, బుద్ధి ఎరిగిన తరువాత.. ఇన్నేళ్లకు ఏకంగా ఇంటర్నెట్‌ దశను మార్చివేసే ఒక విప్లవాత్మక చర్యగా అభివర్ణిస్తున్నారు 'నెట్‌' నిపుణులు.

కమీదట ఇంటర్నెట్‌లో 'పిచ్చి పుల్లయ్య డాట్‌ కాం', 'వెర్రి వెంగళప్ప డాట్‌ నెట్‌'.. లాంటి పేర్లు కనిపిస్తే ఆశ్చర్యమేం లేదు. ఎదుకంటే వెబ్‌సైట్‌ డొమైన్‌ పేర్లు ఏ భాషలోనైనా పెట్టుకోవచ్చంటూ ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌(ఐకాన్‌) సంస్థ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఇంటర్నెట్‌ వాడకందార్లు.. ముఖ్యంగా వెబ్‌సైట్ల నిర్వాహకులకు ఓ శుభవార్త! నిజానికి ఇన్నాళ్లూ వెబ్‌సైట్‌ డొమైన్‌ పేర్లు ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటూ వస్తున్నాయి. ఇంగ్లీషు రాని వాళ్లకు ఇది ఎంతో ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడిక ఈ ఇబ్బంది తొలగిపోనుంది. ఒక్క తెలుగు మాత్రమే కాదు హిందీ, తమిళం, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీతోపాటు రష్యా, చైనా, అరబిక్‌ భాషల్లో కూడా వెబ్‌సైట్‌ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 'ఐకాన్‌' తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం మొత్తానికి ఇంటర్నెట్‌ స్థితిగతులనే మార్చివేయనుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మారుమూలకు వెబ్‌'సైట్‌'..
గ్రామీణ ప్రాంతాలకు వెబ్‌ వెలుగులు నేటికీ పూర్తిగా చేరలేదు. ఫలితంగా ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ శాతం కూడా అక్కడ తక్కువే. వెబ్‌సైట్ల డొమైన్‌ పేర్లు (చిరునామాలు) అధిక భాగం అంగ్లంలో ఉన్న కారణంగా ఆ భాష తెలియని వారు తమ గ్రామాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్లేవారు కారు. భారతీయ భాషలకు సంబంధించిన వెబ్‌సైట్లు, బ్లాగులు ఎన్నో ఇంటర్నెట్‌లో ఇప్పటికే ఉన్నప్పటికీ వాటి డొమైన్‌ పేర్లు ఆంగ్లంలో ఉండడం వల్ల ఆ భాష రాని వారికి వాటి గురించి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఈ డొమైన్‌ పేర్లు కూడా భారతీయ భాషల్లో పెట్టుకోగలిగే అవకాశాన్ని 'ఐకాన్‌' కల్పించడంతో ఇకముందు ప్రాంతీయ భాషలు తెలిసిన ప్రతి ఒక్కరూ వెబ్‌లో వీరవిహారం చేసేందుకు ఆస్కారం ఏర్పడినట్లయింది.
పెరగనున్న సంఖ్య..
ఐకాన్‌ తీసుకున్న చారిత్రక నిర్ణయం పరోక్షంగా ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్ల పెరుగుదలకు దోహదపడనుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారు 160 కోట్ల మంది. వీరిలో సగానికి సగం మంది ఆంగ్ల భాష ఎరుగని వారే. వీరిలో ఎంతోమందికి సొంతగా వెబ్‌సైట్‌ లేదా బ్లాగ్‌ ప్రారంభించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఇంగ్లీష్‌ రాని కారణంగా వెనకడుగు వేస్తున్న వారు ఎందరో. వెబ్‌ లేదా బ్లాగ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలు మొత్తం ఆంగ్లంలోనే జరపాల్సి రావడం, అలాగే ఈ-మెయిల్‌ కూడా ఆంగ్లంలోనే ఇవ్వాల్సి వస్తుండడం వంటి ఇబ్బందులు వెనక్కి లాగుతున్నాయి. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్లు అందుబాటులోకి వస్తే బ్రౌజర్లకు ఇంతకాలం ఉన్న ఇబ్బందులు తొలగిపోవడమేకాక మాతృభాషలో ఈ-మెయిల్స్‌ పంపుకోగలిగే వీలు కూడా కలుగుతుంది.
ఇబ్బందులూ అనేకం..
అయితే వెబ్‌ డొమైన్‌లలో కొత్త కొత్త పేర్లు వచ్చి చేరడం వల్ల అయోమయంతోపాటు భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదనేది నెట్‌ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ఆన్‌లైన్‌ సెర్చ్‌ ఇంజిన్లను కూడా ప్రభావితం చేయనుంది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ప్రస్తుతం ఆంగ్లం మాత్రమే కాకుండా కొరియన్‌, అరబిక్‌ భాషల్లోనూ సెర్చ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ఐకాన్‌ తీసుకున్న నిర్ణయంతో ఒక్క సెర్చ్‌ ఇంజిన్‌లు మాత్రమే కాకుండా ఈ-మెయిల్‌ ప్రొవైడర్లు కూడా అనేక భాషల్లో తమ సేవలను అందించాల్సి వస్తుంది.
కీబోర్దు కిరికిరి..
ఎవరికి వారు వారి వారి భాషల్లో వెబ్‌సైట్ల డొమైన్‌ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ ప్రస్తుతం వినియోగంలో ఉన్న కంప్యూటర్‌ కీబోర్డులు వాటికి ఏ విధంగా సహకరిస్తాయనేది ప్రధాన ప్రశ్న. కంప్యూటర్లను తయారుచేసే కంపెనీలన్నీ ఆల్ఫాబెటికల్‌(ఎ,బి,సి,డి...లు) ఆర్డర్‌లో ఉన్న కీ బోర్డులను సరఫరా చేస్తున్నాయి. అలాంటప్పుడు వీటిపై జపనీస్‌, అరబిక్‌, గ్రీక్‌, హిబ్రూ తదితర యూరోపియన్‌ భాషలు టైప్‌ చేయడం ఎలా? ఒకవేళ ఆయా భాషల్లో కీబోర్డులు తయారైనా వాటిని ఉపయోగించి మరో భాషలో ఉన్న అక్షరాలను ఎలా టైప్‌ చేయగలం? పోనీ ఎవరి మాతృభాషకు సంబంధించి వారు 'వర్చువల్‌ కీ బోర్డులు' డౌన్‌లోడ్‌ చేసుకున్నా ఆంగ్ల అక్షరాలు కలిగి ఉన్న కీ బోర్డు ద్వారా వాటిని ఉపయోగించడం ఎలా?
ఇవన్నీ ప్రస్తుతానికి మాత్రమే సమస్యలు. వీటికి తగిన సమాధానాలు ఇవ్వగలిగేది భవిష్యత్తు ఒక్కటే!



Sunday 1 November 2009

ఇక వెబ్‌ డొమైన్‌ పేర్లు.. ఏ భాషలోనైనా!

ఇకమీదట ఇంటర్‌నెట్‌లో 'పుల్లయ్య డాట్‌ కాం', 'వెర్రి వెంగళప్ప డాట్‌ కాం'.. లాంటి పేర్లు కనిపిస్తే.. ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే ఏ భాషలోనైనా డొమైన్‌పేర్లు సృష్టించుకునేందుకు వీలు కల్పిస్తూ ఇంటర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌ (ఐకాన్‌) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ వాడకందారులందరికీ ఆన్‌లైన్‌ చిరునామాలను కేటాయించేది ఈ సంస్థే.

వెబ్‌సైట్‌ డొమైన్‌ పేర్లు ఇన్నాళ్లూ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటూ వస్తున్నాయి. ఇకపై ప్రపంచంలోని ఏ భాషలోనైనా డొమైన్‌ పేర్లు పెట్టుకోడానికి అనుమతించాలని సియోల్‌లో జరిగిన ఓ సమావేశంలో 'ఐకాన్‌' నిర్ణయించింది. ఇంగ్లీషు రాని వాళ్లు ఇంటర్‌నెట్‌ చూడాలంటే ఇన్నాళ్లూ ఉన్న ఇబ్బంది దీంతో తొలగిపోనుంది. ఇంటర్‌నెట్‌ వాడకందారుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 'ఐకాన్‌' ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాడ్‌ బెక్‌స్ట్రామ్‌ తెలిపారు. ప్రధానంగా ఆసియా, మధ్యప్రాచ్యం, రష్యాలాంటి ప్రాంతాలకు ఇది ఉపయోగకరమన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల మంది ఇంటర్‌నెట్‌ను వాడుతున్నారని, వీరిలో సగానికిపైగా ఇంగ్లీషేతర భాషల్లో రాస్తారని.. అందువల్ల ఈ మార్పు తప్పనిసరి అయ్యిందని రాడ్‌ బెక్‌స్ట్రామ్‌ వివరించారు. ఇంటర్నెట్‌ వ్యవస్థలో ఇదొక చారిత్రక అడుగుగా ఆయన అభివర్ణించారు. ఈనెల16వ తేదీ నుంచి ఇది వివిధ దశల్లో అమలు కానుందని 'ఐకాన్‌' వర్గాలు పేర్కొన్నాయి.