Friday 17 July 2009

రోడ్డు ప్రమాదమా.. అబ్బే జరగదు!

మీరు మీ కారును వేగంగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళుతున్నారు. అర కిలోమీటరు దూరంలో భయంకరమైన మూల మలుపు ఉంది. అవతలి నుంచి కూడా ఓ కారు వేగంగా వస్తోంది. ఆ విషయం మీకు తెలియదు. సరిగ్గా మూల మలుపు దగ్గరకొచ్చేసరికి రెండు కార్లు హఠాత్తుగా ఎదురెదురుగా వచ్చాయి. అప్పుడేం జరుగుతుంది? మామూలుగా అయితే అంత వేగంలో రెండు కార్లూ ఒకదానినొకటి 'ఢీ'కొంటాయి. కానీ ఇకమీదట అలా జరగదు. ఎందుకంటే- మీరు గమనించకపోయినా మీ కారు జరగబోయే ప్రమాదాన్ని పసిగడుతుంది. ఎదురుగా వస్తున్న కారుతో ముందుగానే మాట్లాడుకుంటుంది. ప్రమాదాన్ని అరికట్టి మిమ్మల్ని సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుస్తుంది.

















ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే! త్వరలోనే ఇలాంటి రోబోటిక్‌ కార్లు రాబోతున్నాయి. ఈ విషయంలో మనం శాస్త్రవేత్తలకు 'థాంక్స్‌' చెప్పాల్సిందే. ఎందుకంటే - ఈ కార్లు మాట్లాడుకోవడానికి అవసరమయ్యే అల్గారిథమ్స్‌ను వారే రూపొందించారు కాబట్టి. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ పసిఫిక్‌కు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ అల్గారిథమ్స్‌ను రూపొందించింది. ఇక్కడ భారతీయులమైన మనం కాస్త గర్వపడాలి. ఎందుకంటే- ఈ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్నది మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్‌ భీబయ్య శర్మ, డాక్టర్‌ ఉతేష్‌ చంద్‌. ఈ బృందం రూపొందించిన కొన్ని గణిత సూత్రాలు భవిష్యత్తులో రానున్న రొబోటిక్‌ కార్లు తాము ప్రయాణిస్తున్న దారిని ఎప్పుడు, ఎలా మార్చుకోవాలో తెలియజేస్తాయట.

ఎలాగంటే..
ప్రతి రొబోటిక్‌ కారును అందులో ఉండే సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్‌ నియంత్రిస్తూ ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్‌కు శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథమ్స్‌ ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ ఉంటాయి. ప్రతి కారులోనూ సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్స్‌ ఉంటాయి కాబట్టి ఇవి పరస్పరం సంభాషించుకుంటూ ఉంటాయి. ఎప్పుడన్నా మరీ దగ్గరగా వచ్చినా, ఎదురెదురుపడినా పరస్పరం సంభాషించుకుని సురక్షిత మార్గం ఏదో గుర్తించి ఆ దిశగా కదులుతాయి. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోతాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తలెత్తవు.
ఇప్పటికే కంప్యూటర్‌ సిములేషన్‌ ద్వారా ఈ అల్గారిథమ్స్‌ పనితీరును ప్రదర్శించిన శాస్త్రవేత్తల బృందం ఇప్పుడు దీనిని రోబోట్‌లపై పరీక్షించి చూడాలని భావిస్తోంది. ఇందుకోసం రెండు చక్రాలు కలిగి ఉన్న రోబోట్లను వీరు ఎంచుకున్నారు.

ఫ్లకింగ్‌ ద్వారా...
సాధారణంగా రోబోట్‌లు వేటికవే విడివిడిగా పనిచేస్తాయి. వాటిని రూపొందించేటప్పుడే వాటికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఆ రకంగా సమకూరుస్తారు. అయితే కొన్ని రోబోట్‌లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఎలా? ఇందుకోసం శాస్త్రవేత్తలు ఫ్లకింగ్‌ అనే టెక్నిక్‌ను వాడతారు. దీని వాడకం వలన ఒకటికన్నా ఎక్కువ రోబోట్‌లు బృందంగా ఏర్పడి తమకు అప్పగించిన విధులను నిర్వర్తిస్తాయి. ఈ రోబోటిక్‌ కార్లలో కూడా శాస్త్రవేత్తలు ఈ తరహా పరిజ్ఞానాన్ని సమకూర్చనున్నారు. దీనివలన ఒకటి కన్నా ఎక్కువ కార్లు లైను మారాల్సి వచ్చినప్పుడు వాటిలో ఒక కారు ఇందుకు నాయకత్వం వహిస్తుంది. మిగిలిన కార్లన్నీ తమ నాయకుడ్ని అనుసరిస్తాయి. దీంతో ఇక రోడ్డు ప్రమాదాలకు తావుండదు.

ప్రమాదమే జరగదా?
కార్లు రెండూ ఎదురెదురుగా వచ్చినప్పుడు మాత్రం జరగదు. అలా కాకుండా కార్లు ప్రయాణిస్తున్న సమయంలో ఒకదాని పక్కకు ఒకటి అత్యంత సమీపంలోకి వచ్చినా, లేదంటే కారు మరీ రోడ్డు పక్కకు వచ్చినా ప్రమాదం జరగదని చెప్పలేం. అదేంటి అలా- అని ఆశ్చర్యపోతున్నారా? అదంతే. ఎందుకంటే - రోబోటిక్‌ కార్లలో ఉండే సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్‌లకు సూచనలు అందించే అల్గారిథమ్స్‌ రూపకల్పనలో శాస్త్రవేత్తలు ' ఎట్రాక్షన్‌ టువార్డ్స్‌ ది టార్గెట్‌' అన్న నియమాన్ని పాటించారట. అంటే.. ఎదురెదురుగా వచ్చే రోబోటిక్‌ కార్ల నడుమ మాత్రమే సమాచార బదిలీ జరుగుతుంది. పక్కపక్కన ప్రయాణించే కార్లు పరస్పరం సభాషించుకోలేవు, సమాచారం ఇచ్చిపుచ్చుకోలేవు మరి. అయినా ఏం ఫర్వాలేదు.. ఇలా కార్లు పక్కపక్కనే ప్రయాణిస్తూ పరస్పరంఅత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు, లేదంటే కారు బాగా రోడ్డు పక్కకు వచ్చేసినప్పుడు అందులో ఉండే సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్‌ ఏం చేయాలనే దానిపై ఈ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం మల్లగుల్లాలు పడుతోంది. బహుశా త్వరలోనే ఈ సమస్యకూ వీరు విరుగుడు కనుగొనే అవకాశం ఉంది. అయినా ఇంత వరకు వచ్చారంటే ఇది మాత్రం గొప్ప విజయం కాదూ? అందుకు శాస్త్రవేత్తలను అభినందిద్దాం.

Wednesday 1 July 2009

ఐఫోన్‌ 3Gs - అంతా బాగానే ఉంది కానీ...

యాపిల్‌ ఐఫోన్‌ సరికొత్త మోడల్‌ 'ఐఫోన్‌ 3Gs'భారత్‌లో ఎప్పుడు విడుదల అవుతుందాని సెల్‌ ప్రియులు రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. గతంలో విడుదలైన ఐఫోన్‌ల కంటే అధిక వేగం, మరో 100 కొత్త ఫీచర్లు ఈ కొత్త మోడల్‌ సొంతం. ఐఫోన్‌ 3Gs ఈ ఏడాది ఆగస్టు నెలలో మన దేశంలో విడుదల కానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రీసెర్చ్‌ ఇన్‌ మోషన్‌ కంపెనీ తయారు చేసిన 'బ్లాక్‌బెర్రీ' సెల్‌ఫోన్‌తో పోల్చుకుంటే కొన్ని విషయాలలో ఐఫోన్‌ 3Gs సామర్థ్యం తక్కువేనని, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారికి ఈ ఫోన్‌ ద్వారా కొత్తగా ఒరిగేదేమీ లేదని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

ఐఫోన్‌ 3Gs సాధారణ సెల్‌ వినియోగదారులకు గొప్పగా ఉండొచ్చేమోకానీ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఇతర హై ఎండ్‌ సెల్‌ఫోన్లు ఉపయోగిస్తున్న వారిని అంతగా ఆకట్టుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐఫోన్‌ 3Gsలో దాదాపు 6 లోపాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అవేమిటంటే...

బ్యాటరీ
ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు ఏ స్మార్ట్‌ ఫోన్‌లో అయినా చూసుకునేది బ్యాటరీ జీవితకాలమే. ఐఫోన్‌ 3Gsలో బ్యాటరీ జీవిత కాలాన్ని యాపిల్‌ కంపెనీ పెంచినప్పటికీ, బ్లాక్‌బెర్రీ సిరీస్‌లో చాలా మోడళ్ల బ్యాటరీ జీవితకాలానికి ఇది సాటిరాలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐఫోన్‌ 3Gs బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేసుకుంటే 5 గంటలపాటు 3Gలో మాట్లాడుకోవచ్చు లేదా ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ చేసుకోవచ్చు. అదే బ్లాక్‌బెర్రీ Stormలో అయితే ఐదున్నర గంటలపాటు టాక్‌టైమ్‌, 15 రోజులపాటు స్టాండ్‌బై టైమ్‌ ఉంటాయి.

భద్రత
ఐఫోన్‌ల గురించి ఇంటర్నెట్‌ వెబ్‌సైట్‌లలో ప్రచురితమైన సమీక్షల ప్రకారం... ఇతర కంపెనీల ఫోన్లతో పోల్చుకుంటే ఐఫోన్‌లలో భద్రత తక్కువే. ఇప్పటికి లెక్కలేనన్నిసార్లు ఐఫోన్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఐఫోన్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ OS 3.0కి కూడా ఇప్పటికి 46 భద్రతాపరమైన ప్యాచెస్‌ విడుదల చేశారు. వీటిలో ఎక్కువ భాగం ఐఫోన్‌ సొంత బ్రౌజర్‌ 'సఫారీ', ఓపెన్‌ సోర్స్‌ బ్రౌజర్‌ ఇంజన్‌ 'వెబ్‌కిట్‌'కు సంబంధించినవే.
అయితే భద్రత పరంగా చూసుకున్నప్పుడు యాపిల్‌ ఐఫోన్‌ 3Gsలో ఒక అద్భుతమైన ఫీచర్‌ ఉంది. అదే 'Remote Wipe'. ఒకవేళ మీ ఐఫోన్‌ దొంగిలింపబడితే, అందులోని మీకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని ఈ టూల్‌ సహాయంతో మీరు చెరిపివేయవచ్చు.

కీబోర్డు
యాపిల్‌ ఐఫోన్‌ 3Gsలో 'ఫిజికల్‌ కీబోర్డు' లేకపోవడం ఒక పెద్ద లోపంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మెసేజెస్‌, మెయిల్స్‌, నోట్స్‌ తదితరాల కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ 'ల్యాండ్‌స్కేప్‌ కీబోర్డు'ను సమకూర్చినప్పటికీ, దీనికంటే కూడా స్లైడర్‌ స్టయిల్‌ (ఫోన్‌ పైభాగాన్ని వేలితో పక్కకు తోయగానే కింద కీబోర్డు కనిపించడం) QWERTY కీబోర్డు ఉంటే వ్యాపార వర్గాల వారికి టైపింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉండేదనేది విశ్లేషకుల భావన. ఇలాంటి కీబోర్డు రీసెర్చ్‌ ఇన్‌ మోషన్‌ కంపెనీ రూపొందించిన బ్లాక్‌బెర్రీ సిరీస్‌ ఫోన్లలో ఉంటుంది.

వీడియో రికార్డింగ్‌
ఇప్పటి వరకు యాపిల్‌ ఐఫోన్‌లలో ఉన్న అతి పెద్ద లోపం.. వీడియో రికార్డింగ్‌ సదుపాయం లేకపోవడం. అయితే కొత్త మోడల్‌ 3Gsలో యాపిల్‌ కంపెనీ ఈ లోపాన్ని సరిదిద్దుకున్నప్పటికీ ఫోన్‌ ముందు భాగంలో కెమెరాను అమర్చకపోవడం వల్ల వినియోగదారులకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ సదుపాయం లభించదు. అంటే వీడియోను చూడగలం, రికార్డు చేయగలం కానీ దానిని Wi-Fi, లేదా సెల్యులార్‌ నెట్‌వర్క్‌ ద్వారా మరొకరికి పంపలేం, ఇతరుల నుంచి అందుకోలేం. ఇతర హై ఎండ్‌ సెల్‌ఫోన్లలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సదుపాయం ఉన్నప్పటికీ ఐఫోన్‌ 3Gsలో అది లేకపోవడం దానిని ఇష్టపడే వ్యాపార వర్గాల వారికి పెద్ద నిరాశే.

ఎడిటింగ్‌
ఐఫోన్‌లో మరో పెద్ద నిరాశ.. వర్డ్‌ డాక్యుమెంట్‌ అప్లికేషన్‌ను ఎడిట్‌ చేసుకోలేక పోవడం. అంటే.. వర్డ్‌ డాక్యుమెంట్‌లను చదవగలమే కానీ అందులో తప్పొప్పులను సరిచేయలేమన్న మాట. ఫోన్‌ ఎంత బాగున్నప్పటికీ, ఇతర ఫీచర్లు అదిరిపోయేలా ఉన్నప్పటికీ.. ఇలాంటి కొన్ని లోపాల కారణంగా యాపిల్‌ ఐఫోన్‌ నేటికీ చాలామంది దరికి చేరలేకపోతోంది. ఎడిటింగ్‌ సౌకర్యం ఉన్న ఇతర ఫోన్లు ఎన్నో మార్కెట్‌లో ఉన్న తరుణంలో యాపిల్‌ కూడా ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కనీసం ఎడిటింగ్‌ సౌకర్యాన్ని కల్పించే థర్డ్‌ పార్టీ అప్లికేషన్లను అందించడం ద్వారా అయినా ఐఫోన్‌లో ఉన్న ఈ లోపాన్ని యాపిల్‌ సరిదిద్దవచ్చు.

ఫ్లాష్‌ సపోర్ట్‌
ఐఫోన్‌లలో మరో లోపం.. అవి ఫ్లాష్‌ ఫార్మేట్‌లో ఉన్న మల్టీమీడియా ఫైల్స్‌ను ప్లే చేయలేకపోవడం. ఐఫోన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ 3Gsలో సైతం ఫ్లాష్‌ సపోర్ట్‌ లేకపోవడం అభిమానులను బాధించే అంశమే. ఐఫోన్‌లలో ఫ్లాష్‌ అప్లికేషన్‌ అతి తక్కువ వేగంతో పనిచేయడం వల్లే దానిని చేర్చడం లేదని గతంలోనే యాపిల్‌ ప్రకటించింది. అయినా సరే, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ సమయంలో ఫ్లాష్‌ కంటెంట్‌ను మిస్‌ అవడం తమను తప్పక నిరాశకు గురిచేసే అంశమేనని ఐఫోన్‌ అభిమానులు పేర్కొంటున్నారు.
మరి, ఇన్ని లోపాలతో కూడిన ఐఫోన్‌ 3ఎఖిను భారతదేశంలో ఎంతమంది ఇష్టపడతారో వేచి చూడాల్సిందే!

దుమ్ము అంటుకోని దుస్తులు!

ఎక్కడ పడితే ఆక్కడ కూర్చుంటే దుస్తులు మాసిపోతాయేమోని ఒకరు అనుకుంటే, ఐస్‌క్రీమ్‌, చాక్లెట్‌ మరకలు కనిపిస్తే అమ్మ ఒళ్లు చీరేస్తుంది అని పిల్లలు భయపడుతుంటారు. అయితే ఇకముందు మాత్రం ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, దుమ్మును, మరకలను వాటంతట అవే శుభ్రం చేసుకునే దుస్తులు వచ్చేశాయి మరి. నమ్మకం కలగడం లేదా? అయితే మీరే చదవండి.

ఇప్పుడు మార్కెట్లో కొన్ని రకాల పెయింట్లు, రూఫ్‌లు, కిటికీ అద్దాలు లభిస్తున్నాయి. దుమ్ము, ధూళి కారణంగా వీటికి ఎలాంటి మరకలు అంటుకోవు. ఒకవేళ అంటుకున్నా, కాసిని నీళ్లు పోసి తుడవగానే మరకలు, ముద్రలు అన్నీ మటుమాయం అవుతాయి. అయితే ఎందుకని వీటికి మరకలు అంటుకోవు? ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణ వెనుక ఉన్నది మన జాతీయ పుష్పం 'కమలం' అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ! కానీ ఇది నిజం.
కమలం సాధారణంగా చిన్న చెరువుల్లో, మురికినీటి గుంతల్లోని బురదలోంచి పురుడుపోసుకుంటుంది. కానీ దానిని చూసిన వారు అది బురదలో పుట్టిందంటే ఎంత మాత్రమూ నమ్మలేనంతగా ఉంటుంది. ఎప్పుడూ చూసినా కడిగిన ముత్యంలా మెరిసిపోతుంటుంది. దీనికి కారణం అది తనంత తానుగా (సెల్ఫ్‌ క్లీనింగ్‌) శుభ్రం చేసుకుంటుండడమే.

లోటస్‌ ఎఫెక్ట్‌
కమలం ఆకులను ఎప్పుడైనా పరీక్షగా గమనించినట్టయితే మనకో విషయం బోధపడుతుంది. దానిపై నీటి చుక్కలు ఏమాత్రం నిలవవు. కమలం ఆకులపై ఎన్ని బకెట్ల నీళ్లు కుమ్మరించినా కూడా కేవలం ఒకటి రెండు చుక్కలే దాని ఆకులపై నిలబడతాయి. కచ్చితంగా ఇదే విషయం జర్మనీకి చెందిన వృక్షశాస్త్ర నిపుణుడు 'విల్‌ హెలమ్‌ బార్తోలోట్‌' దృష్టిని ఆకర్షించింది. అంతే.. దీని గురించి ఆయన విస్తృతంగా పరిశోధనలు జరిపి అనేక విషయాలను కనుగొన్నాడు. తాను కనుగొన్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానానికి ఆయన 'లోటస్‌ ఎఫెక్ట్‌' అని నామకరణం చేశాడు.

ఎందుకు తడవదు?
కమలం ఆకులు వర్షంలో ఎంతగా తడిసి ముద్దయినప్పటికీ దాని ఆకులపైన కేవలం ఒకటి రెండు నీటి బిందువులు మాత్రమే నిలబడడానికి కారణం వాటిపై ఉండే మైనం లాంటి పదార్థం, చిన్నచిన్న బొడిపెలు, సన్నటి నూగు మాత్రమే. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి 1970లో బార్తోలోట్‌ కమలం ఆకులను స్కానింగ్‌ చేశాడు. ఈ పరిశోధనలో ఆసక్తి కరమైన అంశాలు ఎన్నో బయటికి వచ్చాయి. మొత్తం వర్షపు చినుకుల్లో కేవలం 2-3 శాతం బిందువులు మాత్రమే కమలం ఆకుల ఉపరితలంపై నిలబడి, మిగతావి కిందికి జారి పోతాయి. క్యూటిన్‌ అని పిలిచే ఒకరకమైన పదార్థమే కమలం ఆకుపై మైనంలా పరుచుకొని ఉంటుందని, దీనివల్లే నీటి బిందువులు ఆకులపై నిలబడటం లేదని బార్తోలోట్‌ గ్రహించాడు. ఈ కారణంగానే నీటి బిందువులు అతి తక్కువ సంఖ్యలో ఆకుపై కూర్చుంటాయి. అది కూడా కమలం ఆకు 90 డిగ్రీల కన్నా ఎక్కువ కోణంలో ఉన్నప్పుడే. అంతకంటే తక్కువ ఉంటే ఆకుపై నీటి బిందువులు నిలువలేవు. మరోవైపు ఆకుపై ఉండే లెక్కలేనన్ని బొడిపెలు ఈ కోణాన్ని 150 డిగ్రీలకు పెంచేస్తాయి. దీనివల్ల ఆకులు 'సూపర్‌- హైడ్రోఫోబిక్‌'గా తయారవుతాయి. ఇంకోవైపు సన్నటి నూగులాంటి నిర్మాణాలు ఈ కోణాన్ని మరో 16 డిగ్రీలు పెంచేస్తాయి. ఈ కారణంగానే నీటి బిందువులు కమలం ఆకుపై నిలువ కుండా దొర్లిపోతాయి. అయితే నిలబడే కొద్దిపాటి నీటి బిందువుల కూడా ఆకుపై ఉండే బొడిపెలపై నిలుచుంటాయి. ఒక మనిషి మేకుల మంచంపై పడుకుంటే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఇదే విధంగా బురద, దుమ్ము కూడా ఆకుమీద బొడిపెలపై మాత్రమే నిలబడుతుంది. వర్షపు చుక్కలు ఆకుమీద పడి కిందికి జారిపోతున్నప్పుడు దానిమీద ఉన్న దుమ్ము, ధూళి, బాక్టీరియాను కూడా అవి తమతోపాటు కిందికి లాగేసుకుంటాయి. ఈ కారణంగానే కమలం ఎప్పుడూ స్వచ్ఛంగా కనిపిస్తుంది.

వ్యాపారంగా
ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టిన బార్తోలోట్‌ మొదట దీనిని కమర్షియల్‌గా ఉపయోగించుకోవచ్చనే విషయం గురించి పట్టించుకోలేదు. కానీ 1980లో ఆయనలో ఈ ఆలోచన మొగ్గతొడిగింది. కొద్దిగా ముతక గా, మైనంతో కూడిన ఉపరితలాన్ని సింథసైజ్‌ చేసినట్టయితే కృత్రిమ 'లోటస్‌ ఎఫెక్ట్‌'ను తయారు చెయ్యవచ్చనే నిర్ధారణ కొచ్చాడు. 1997లో తన 'లోటస్‌ ఎఫెక్ట్‌'కు పేటెంట్‌ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇదే టెక్నాలజీని ఉపయోగించి 'డాకర్స్‌ అండ్‌ గ్యాప్‌' సంస్థ 'సెల్ఫ్‌ క్లీనింగ్‌ క్లోత్స్‌( తమను తామే శుభ్రపరుచుకునే దుస్తులు) ను ఉత్పత్తి చేస్తోంది.

ఎలా చేస్తారు?
ఈ దుస్తుల తయారీలో 'అనటాస్‌ టైటానియమ్‌ డైయాక్సైడ్‌' కాంపౌండ్‌ నానో క్రిస్టల్స్‌ను ఉపయోగిస్తారు. ఇవి ఫొటోకెటాలటిక్‌ను డీగ్రేడ్‌ చేయగలవు. ఇవి దుస్తులకు అంటిన దుమ్ము, ధూళిని సులభంగా తొలగిస్తాయి. అంతేకాక ఎంతో శక్తివంతమైన హానిచేసే 'మైక్రోఆర్గాజమ్స్‌'ను కూడా తొలగిస్తాయి.

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌
సెల్ఫ్‌ క్లీనింగ్‌ దుస్తులు అందుబాటులోకి వస్తే పర్యావరణానికి పెరుగుతున్న ముప్పుకూడా చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ దుస్తులు అందుబాటులోకి వస్తే రసాయలనాలు, విద్యుత్తు, నీళ్లు తదితరాల వినయోగం తగ్గుతుంది. తద్వారా పర్యావరణాన్ని కొంత వరకు పరిరక్షించుకోవచ్చు అని పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు డ్రై క్లీనింగ్‌కు అయ్యే ఖర్చునుంచి కూడా ప్రజలు ఉపశమనం పొందొచ్చన్నమాట. ఈ టెక్నాలజీ మరింత విస్తృతమైతే ఇకముందు దుస్తులు ఉతికేందుకు మహిళలు ఏమాత్రం కష్టపడనక్కర్లేదు. ముఖ్యంగా పిల్లలు తమకిష్టమైన ఆహార పదార్థాలు దుస్తులపై పడతాయేమో అనే భయం లేకుండా తినేయొచ్చు. అలాగే ఎక్కడైనా సరే దుమ్ము ఆలోచన లేకుండా కూర్చోవచ్చు. అయితే డిటర్జెంట్‌ సబ్బులు తయారు చేసే కంపెనీలకు మాత్రం పెద్ద చిక్కే వచ్చి పడుతుంది. ఈ సెల్ఫ్‌ క్లీనింగ్‌ దుస్తులు గనుక అందుబాటులోకి వసే తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చే విషయంలో ఈ కంపెనీలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఈ దుస్తులు కొనేద్దామని మార్కెట్‌కు మాత్రం వెళ్లకండి. ఎందుకంటే ఇవి రావడానికి మరో రెండేళ్లు పట్టొచ్చు.
చూద్దాం.. భవిష్యత్తులో మానవ జీవితంలో ఇంకా ఏమేం విచిత్రాలు చోటుచేసుకుంటాయో!