Thursday 24 September 2009

మైక్రోసాఫ్ట్‌ నుంచి మొబైల్‌ఫోన్లు!?

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్‌' త్వరలోనే రెండు స్మార్ట్‌ ఫోన్‌లు విడుదల చేయనుందనే పుకార్లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో షికార్లు చేస్తున్నాయి. వీటిల్లో నిజం ఎంతో తెలియదుకానీ, కొన్ని వెబ్‌సైట్లు ఓ అడుగు ముందుకేసి మరీ ఈ పుకార్ల షికారులో పాలుపంచుకుంటున్నాయి.

2010లో జరగనున్న 'ఇంటర్నేషనల్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో'లో మైక్రోసాఫ్ట్‌ 'టర్టిల్‌', 'ప్యూర్‌' అనే పేర్లతో రెండు స్లయిడర్‌ స్మార్ట్‌ ఫోన్‌లతోపాటు ఒక 'సర్ఫేస్‌ టాబ్లెట్‌ పిసి'ని కూడా ప్రదర్శించనుందని 'ఎన్‌గాడ్జెట్‌' అనే వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ 'పిసి వరల్డ్‌' తన వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఒక కథనాన్ని ఉంచింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ 'షార్ప్‌' భాగస్వామ్యంతో ఈ మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుందనేది ఆ పుకార్ల సమాచారం.

తన మొబైల్‌ఫోన్ల ప్రాజెక్టుకు మైక్రోసాఫ్ట్‌ ' ప్రాజెక్ట్‌ పింక్‌' అనే కోడ్‌నేమ్‌ పెట్టుకుందని కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మైక్రోసాఫ్ట్‌ 'ప్రాజెక్ట్‌ పింక్‌'కు సంబంధించిన పుకార్లు వెలువడ్డాయి. ఆమధ్య యాపిల్‌ కంపెనీ 'ఐ-ఫోన్‌' విడుదల చేయడంతో అందుకు ధీటుగా మైక్రోసాఫ్ట్‌ తన 'ప్రాజెక్ట్‌ పింక్‌'కు సన్నాహాలు ప్రారంభించిందని, అయితే 'విండోస్‌ మొబైల్‌ 7' సాఫ్ట్‌వేర్‌ ఇంకా విడుదల కాకపోవడంతో
ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగానే రూపుదిద్దుకోనున్న 'ప్రాజెక్ట్‌ పింక్‌' ఆలస్యం అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్‌ గతంలో హైటెక్‌ కంప్యూటర్స్‌ (హెచ్‌టిసి) భాగస్వామ్యంతో మొబైల్‌ఫోన్లు తయారు చేయాలని భావించిందని, కానీ తరువాత ఎందుకో ఆ ప్రతిపాదన విరమించుకుందని, ఇప్పుడు తాజాగా తన 'ప్రాజెక్ట్‌ పింక్‌' భాగస్వామిగా 'షార్ప్‌' కంపెనీని ఎంచుకుందని సమాచారం.

సర్ఫేస్‌ టాబ్లెట్‌ పిసి కూడా..
2007 మే నెలలోనే మల్టీ టచ్‌ 'సర్ఫేస్‌' టేబుల్‌ పిసిని విడుదల చేసిన మైక్రోసాఫ్ట్‌ తాజాగా ఈ శ్రేణిలోనే ఒక 'టాబ్లెట్‌ పిసి' విడుదలకు కూడా సన్నాహాలు సాగిస్తోంది. ఒకేసారి అనేక మంది యూజర్లు ఉపయోగించగలిగే సర్ఫేస్‌ టేబుల్‌ తరహాలోనే ఈ మల్టీ టచ్‌ సర్ఫేస్‌ టాబ్లెట్‌ పిసి కూడా ఉండొచ్చని టెక్‌ పరిశీలకులు ఊహిస్తున్నారు. యాపిల్‌ కంపెనీ 'వెబ్‌ టాబ్లెట్‌' పేరిట మల్టీటచ్‌ సదుపాయం కలిగిన కంప్యూటర్‌ను తయారు చేయబోతోందనే వార్త ఆమధ్య దావానలంలా వ్యాపించింది. ఇందుకు పోటీగానే మైక్రోసాఫ్ట్‌ మల్టీ టచ్‌ సర్ఫేస్‌ టాబ్లెట్‌ పిసి రూపకల్పనకు నడుంబిగించిందని, పరిస్థితులు అనుకూలిస్తే.. 2010లో జరగనున్న 'ఇంటర్నేషనల్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో'లో తన మొబైల్‌ ఫోన్లతోపాటు దీనిని కూడా ప్రదర్శించాలని మైక్రోసాఫ్ట్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని టెక్‌ పరిశీలకులు పేర్కొంటున్నారు.

అయితే ఇవన్నీ కేవలం పుకార్లేనా? లేక సమీప కాలంలో నిజాలుగా మారే అవకాశాలు ఉన్నాయా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!

0 comments: