ఖగోళ శాస్త్రవేత్తల అంచనా నిజమైంది. నలభై సంవత్సరాల వారి సుదీర్ఘ కృషికి ఫలితం లభించింది. మొత్తానికి 'జాబిల్లి' జల రహస్యం వీడిపోయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' చేపట్టిన చంద్రయాన్-1 ప్రయోగం చంద్రునిపై అపార జలరాసులు దాగున్నట్లు సమాచారం అందించింది. ఒక్క చంద్రుడిపైనే కాదు, మన సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలలో నీటి జాడలు కొనుగొనే దిశగా మరిన్ని పరిశోధనలు జరపడానికి ఇది స్ఫూర్తిదాయకం కానుంది. రాబోయే రోజుల్లో చంద్రమండలం ఒక్క మానవ ఆవాసంగానే కాదు, భవిష్యత్తులో గ్రహాంతర యానాలకు కేంద్ర బిందువుగా కూడా మారనుంది.

1969లో మానవుడు తొలిసారిగా చంద్రుడిపై కాలుమోపినప్పుట్నించి నేటివరకు చంద్రుడి గురించి అనేక పరిశోధన, అన్వేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి ఖగోళ శాస్త్రవేత్తలు మొన్నమొన్నటి వరకు జరిపిన ప్రయోగాలు చంద్రుడుకేవలం శిలా సమూహమనే సమాచారాన్నే వెల్లడించాయి. దీంతో చంద్రుడికి సంబంధించిన అనేక అంశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే 1994లో ప్రారంభించిన క్లెమెంటైన్ మిషన్, 1999లో ప్రయోగించిన 'కాసిని ఉపగ్రహం', 2008లో ప్రయోగించిన లూనార్ రికొనైసెన్స్ అబ్జర్వర్ ఉపగ్రహ ప్రయోగాలు చంద్రుడికి సంబంధించిన మరిన్ని వివరాలను మనకు అందించాయి. అయితే తాజాగా 'ఇస్రో' చేపట్టిన చంద్రయాన్-1 ప్రయోగం మాత్రం చంద్రుడిపై ఉన్న నీటి జాడలను పసిగట్టి ఆ వివరాలు అందించి ఇన్నాళ్లూ శాస్త్రవేత్తలలో చంద్రుడి గురించి ఉన్న అనుమానాలను పటాపంచలు చేసింది. చంద్రయాన్-1 తీసిన ఫొటోల ఆధారంగా చంద్రుడిపై ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకూ 10 డిగ్రీల పరిధిలో నీరు మందంగా పరుచుకుని ఉందని, పగటి వేళలో సూర్యుడి నుంచి వచ్చే అమిత వేడి కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న నీరు ఆవిరవుతోందని అర్థమవుతోంది. అలాగే సూర్యుడి వేడి సోకని ప్రాంతాలలో నీరు గడ్డకట్టి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ జాబిల్లి జల రాసులను ఇంటికి తెచ్చుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరం.
చంద్రుడిపై నీరు ఎలా?
చంద్రుడిపై జలరాసులు ఎలా ఏర్పడి ఉంటాయనే విషయంలో ఖగోళ శాస్త్రవేత్తలు రెండు వాదనలు వినిపిస్తున్నారు. 390 కోట్ల సంవత్సరాలకు పూర్వం తోకచుక్కలు, ఉల్కాపాతాలు భూమి, చంద్రుడి ని పెద్ద ఎత్తున ఢీకొడుతుండేవి. వీటి ద్వారానే చంద్రుడిపైకి నీరు చేరి ఉంటుందని, సూర్యుడి వేడి తీవ్రతకు అందులో కొంత శాతం ఆవిరైనప్పటికీ ఇంకా కొంత మిగిలి ఉంటుందనేది మొదటి వాదన. హైడ్రోజన్ ఐయాన్లు, ప్రొటాన్లతో కూడిన సౌర పవనాలు ఒక్క సెకనుకు లక్ష కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టడం వల్ల రసాయన చర్య ద్వారా చంద్రుడిపై నీటి నిల్వలు ఏర్పడి ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల మరో వాదన.
'ఎం3'.. రియల్లీ గ్రేట్!
నీటి ఆచూకీ కనుక్కున్న చంద్రయాన్-1లోని 'ది మూన్ మినరాలజీ మ్యాపర్ (ఎం3) పరికరాన్ని అమెరికాకు చెందిన 'నాసా' ప్రొపల్షన్ లాబొరేటరీ, బ్రౌన్ యూనివర్సిటీలు సంయుక్తంగా రూపొందించాయి. చంద్రుడిపై వెలుగున్న ప్రాంతంలో నీటి నిల్వలను ఈ ఎం3 పరికరం పసిగట్టింది. నిజానికి చంద్రుడి గురించి ఇప్పటి వరకూ మనకు తెలిసిన సమాచారం కన్నా ఈ ఎం3 అందించిన సమాచారం మరింత స్పష్టమైనది. ఈ పరిశోధనా ఫలితాలను నాసా.. గతంలో తన ఉపగ్రహాలు అందించిన సమాచారంతో పోల్చి చూసి «ద్రువీకరించింది. ఈ విషయమై బ్రౌన్ యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రజ్ఞుడిగా పనిచేస్తున్న కార్లే పీటర్స్ మాట్లాడుతూ "ఈ విజయం ఇస్రోదే.. చంద్రయాన్ సహకారం లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు..'' అని వ్యాఖ్యానించారు.
నీరు ఉంటే ఏంటి?
చంద్రుడిపై నీటి జాడలు బయటపడ్డాయి కదా, ఇక చంద్రమండలంపై మానవ నివాసం కూడా సాధ్యమవుతుందా? అంటే అది అనుకున్నంత సులువేం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే భూమిపై ఉన్నటువంటి వాతావరణం.. చంద్రుడిపై లేదు. పైపెచ్చు సూర్యుడి నుంచి వచ్చే అమితమైన వేడి నిరంతరం చంద్రుడిని తాకుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నివాసం అనుకున్నంత సులువేం కాదని, ఈ విషయలో మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందనేది వారి అభిప్రాయం. అయితే చంద్రుడిపై జలాన్ని హైడ్రోజన్ ఇంధనంగా, ప్రాణవాయువైన ఆక్సిజన్గా మార్చుకునే వీలుంది. ఇలా తయారైన ఆక్సిజన్ భవిష్యత్తులో అక్కడ నివాసం ఏర్పరుచుకునే మానవులకు ప్రాణాధారంగా మారుతుంది. అలాగే హైడ్రోజన్ రాకెట్లుకు ఇంధనంగా పనికొస్తుంది.
భవిష్యత్తు ప్రయోగశాల.. చంద్రుడే!
నేషనల్ స్పేస్ సొసైటీ ప్రెసిడెంట్ సురేష్నాయక్ మాట్లాడుతూ "చంద్రుడిపై ఉన్న నీటిని రాకెట్కు అవసరమైన ఇంధనంగా మార్చుకోవచ్చు..'' అని చెబుతున్నారు. అంతేకాదు "భూమి గురుత్వాకర్షణ శక్తి కంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి చాలా (1/6 వంతు)తక్కువ.. కాబట్టి ఇప్పుడు మనం భూమి నుంచి ప్రయోగిస్తున్న ఉపగ్రహాలను చంద్రుడిపై నుంచి ప్రయోగించడం చాలా తేలిక.. ప్రస్తుతం భూమిపై నుంచి ప్రయోగించే ఉపగ్రహాలు సెకనుకు 11 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలోకి దూసుకెళుతున్నాయి.. అదే చంద్రుడిపై నుంచి అయితే మరింత వేగంగా వెళ్లగలవు'' అని వివరిస్తున్నాయరాయన.
నేడు ఖగోళ శాస్త్రజ్ఞుల ముందున్నవి రెండు ప్రధాన లక్ష్యాలు. ఒకటి ప్రాణాధారమైన జలం. రెండు జీవనాధారమైన ఇంధనం. ఈ రెండింటి కోసమే మానవుడి నిత్యశోధన . జాబిల్లిపై జలరాసులను స్పష్టంగా గుర్తించడం ద్వారా ఈ అన్వేషణను చంద్రయాన్-1 సరికొత్త మలుపు తిప్పింది. ఇది భారతదేశ పరిశోధనా సామర్థ్యానికి ఒక ప్రతీక. నీటి నిల్వలను కనుక్కోవడం ద్వారా తన విధులను చంద్రయాన్-1 సమర్థవంతంగా నిర్వర్తించిందని ఆ ప్రాజెక్టు డైరెక్టర్ మైలస్వామి అన్నాదురై పేర్కొంటున్నారు. ఈ విజయం అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇతర దేశాలకు భారత్కు మధ్యనున్న సహకారానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.