
ముప్పై మూడేళ్ళ క్రితం ఆ మానవ రహిత వ్యోమనౌక భూమి నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. దాని లక్ష్యం.. విశ్వ రహస్యాలను సేకరించడం, గ్రహాంతర వాసుల ఆచూకీ కనుగొనడం! ఇన్నేళ్లూ అంతరిక్షంలో ప్రయాణిస్తూ భూమికి ఎంతో విలువైన సమాచారం చేరవేసిన ఆ వ్యోమనౌక నుంచి ప్రస్తుతం ఏమాత్రం అర్థం కాని రీతిలో సందేశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మన ప్రపంచంలోని ఏ భాషకూ ఆ సంకేతాలు సరిపోలడం లేదు. ఒకవేళ ఆ వ్యోమనౌక గ్రహాంతర వాసుల చేతికిగాని చిక్కిందా? ఆ సందేశాలు వారు పంపిస్తున్నవేనా? ఖగోళ శాస్త్రవేత్తల్లో ఇప్పుడు ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.
ఈ అనంత విశ్వంలో కొంత భాగాన్నైనా శోధించాలని, ఒకవేళ గ్రహాంతర వాసులు ఉన్నట్లయితే, భూమి మీద ఉన్న మన ఉనికిని వారికి తెలియజేయాలన్న లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' 1977లో వాయేజర్ -2 అనే వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించింది. ప్రపంచంలోని వివిధ భాషల్లో ఉన్న సంప్రదాయ సంగీతం, ప్రకృతి సహజమైన శబ్ద రీతులు, 55 భాషలలో శుభాకాంక్షల సందేశాలను, అనలాగ్ రూపంలో ఉన్న 115 చిత్రాలను బంగారు పూతతో కూడిన పన్నెండు అంగుళాల రాగి డిస్క్పై శబ్దం రూపంలో నిక్షిప్తం చేసి దానిని ఈ వ్యోమనౌకలో పొందుపరిచారు. ఈ సువిశాల విశ్వంలో నిజంగా గ్రహాంతర వాసులే గనక ఉండి ఉంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా వారికి వాయేజర్-2 వ్యోమనౌక గనుక తారసపడితే, ఆ వ్యోమనౌకను ఎవరు ప్రయోగించారో, ఏ లక్ష్యంతో ప్రయోగించారో అర్థం చేసుకునేందుకు ఈ సంగీతం, శుభాకాంక్షల సందేశాలు ఉపయోగపడతాయనేది నాటి నాసా శాస్త్రవేత్తల భావన. అంతేకాదు, ఈ వ్యోమనౌక వెలుపలి భాగంలో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్ పేరిట ఒక సందేశం కూడా ముద్రితమై ఉంటుంది.
సుధీర్ఘ కాలం సేవలు..
నిజానికి శాస్త్రవేత్తలు తొలుత నిర్ణయించిన ప్రకారం వాయేజర్-2 వ్యోమనౌక జీవిత కాలం నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఈ నాలుగేళ్ళలో ఇది శనిగ్రహం సమీపానికి వెళ్ళి ఆ గ్రహానికి సంబంధించిన సమాచారాన్ని భూమి మీదికి చేరవేయాల్సి ఉంటుంది. 1977లో తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాది వరకు.. అంటే ముప్ఫై మూడేళ్ళపాటు వాయేజర్-2 భూమికి ఎంతో విలువైన సమాచారాన్ని చేరవేస్తూ వచ్చింది. ఒక్క శని గ్రహం గురించే కాదు, బృహస్పతి, యురెనస్, నెఫ్ట్యూన్ గ్రహాల సమీపంలోకి కూడా వెళ్లి ఆయా గ్రహాలకు సంబంధించిన ఎంతో సమాచారాన్ని భూమ్మీదికి చేరవేసింది. మన సౌర కుటుంబం గురించి ఇప్పటి వరకు మనం చూడని, మనకు తెలియని ఎన్నో విషయాలను వాయేజర్-2 మనకు అందించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి వాయేజర్-2 వ్యోమనౌక మన సౌర కుటుంబం అంచులకు చేరుకుంది. ఇక్కడి నుంచి ఇది పంపించే సంకేతాలు మన భూమికి చేరడానికి పదమూడు గంటల సమయం పట్టేది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీ నుంచి హఠాత్తుగా దీని నుంచి వచ్చే సమాచారం ఆగిపోయింది. అంతేకాదు, ఇప్పుడు దీన్నుంచి అర్థం పర్థం లేదని సంకేతాలు భూమి మీద ఉన్న నియంత్రణ కేంద్రానికి అందుతున్నాయి. ఆ సంకేతాలు ఏ భాషకు సంబంధించినవో ఖగోళ శాస్త్రవేత్తలు అంతుబట్టడం లేదు.
ఏం జరిగి ఉంటుంది?
వాయేజర్-2 వ్యోమనౌక నుంచి అర్థంకాని సంకేతాలు రావడం గురించి ఖగోళ శాస్త్రవేత్తలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా అందులో సాంకేతిక, విద్యుత్తు లోపం ఏదైనా ఏర్పడి ఉండొచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఆ వ్యోమనౌక గ్రహాంతర వాసుల ఆధీనంలోకి వెళ్లిపోయి ఉంటుందని, ప్రస్తుతం దాన్నుంచి వస్తున్న అర్థం పర్థం లేని సంకేతాలు బహుశా వారు పంపిస్తున్నవే అయి ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. 2006 నవంబరు 30న జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలోని కమాండ్ సెంటర్ నుంచి ఇచ్చిన ఆదేశాలను వాయేజర్-2 తప్పుగా అర్థం చేసుకుందని, ఫలితంగా అందులో ఉన్న మాగ్నెటోమీటర్కు సంబంధించిన హీటర్లు పని చేయడం మొదలెట్టాయని, ఇలా ఈ హీటర్లు 2006 డిసెంబర్ 4 వరకు పని చేస్తూనే ఉన్నాయని, దీంతో వాయేజర్-2 వ్యోమనౌకలోని ఉష్ణోగ్రత 130 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరిందని, బహుశా ఈ అధిక వేడి వల్లనే వాయేజర్-2 పనితీరు మారిపోయి ఉంటుందనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు వాయేజర్-2 వ్యోమనౌక నుంచి అందుతున్న సంకేతాలను డీకోడ్ చేసే ప్రయత్నాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించగలమనే ధీమాను నాసా శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. బహుశా సమాచారాన్ని భూమికి చేరవేసే 'ఫ్లయిట్ డేటా సిస్టం'లో ఏదైనా సమస్య తలెత్తి ఉండవచ్చని, వ్యోమనౌక నుంచి అర్థం పర్థం లేని సంకేతాలు అందడానికి కారణం ఇదే అయి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. అందుకే వాయేజర్-2 తనకు సంబంధించిన సమాచారాన్నే కొంత కాలంపాటు భూమికి చేరవేసేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
'ఇది వారి పనే..'
అయితే వాయేజర్-2 గ్రహాంతర వాసుల చేతికి చిక్కి ఉంటుందని, ప్రస్తుతం కమాండ్ సెంటర్కు చేరుతున్న సంకేతాలు వారు పంపుతున్నవే అయి ఉండొచ్చని జర్మనీకి చెందిన అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ నిపుణుడు హార్ట్విగ్ హాస్డ్రాఫ్ వ్యాఖ్యానిస్తున్నారు. వాయేజర్-2లో అమర్చిన గోల్డ్ డిస్క్, అందులో ముప్ఫై మూడేళ్ల క్రితం మనం నిక్షిప్తం చేసిన సమాచారానికి బహుశా ఇది గ్రహాంతర వాసుల స్పందన అయి ఉండొచ్చని, అయితే ఇది నిజమో, కాదో తెలుసుకోడానికి మరికొద్దికాలం పడుతుందని ఆయన పేర్కొంటున్నారు.